వ్యాక్సినేషన్ డ్రైవ్: టీకా తీసుకున్న ఆసుపత్రి వార్డు బాయ్ మృతి
వ్యాక్సినేషన్ డ్రైవ్ తొలిరోజు టీకా తీసుకున్న ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లా ఆసుపత్రి వార్డు బాయ్ ఆ మరుసటి రోజు మృతి చెందాడు. వార్డు బాయ్ మహిపాల్ సింగ్ సీరం ఇన్స్టిట్యూట్ కోవిడ్ వ్యాక్సిన్ 'కోవిషీల్డ్' తీసుకున్న తర్వాత శ్వాస సంబంధిత ఇబ్బందులు, ఛాతీనొప్పి వంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. దీనిపై ఆసుపత్రి చీఫ్ మెడికల్ అధికారి వివరణ ఇస్తూ, మహిపాల్ సింగ్ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడని, ఒక రోజు తర్వాత శ్వాస ఆడక ఛాతీనొప్పితో బాధపడ్డాడని తెలిపారు. వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత నైట్ షిఫ్ట్ చేశాడని, అయితే వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్తో అతను మరణించినట్టు తాను అనుకోవడం లేదని చెప్పారు. మృతికి ఇతమిత్ధమైన కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
కాగా, ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపపత్రిలో సెక్యూరిటీ గార్డుగా ఉన్న 22 ఏళ్ల వ్యక్తి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సమస్యలు తలెత్తడంతో ఐసీయూలో చేర్చారు. వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం ఎలర్జీ రియాక్షన్ తలెత్తిందని, తలపోటు, ర్యాష్, రెస్పిరేటరీ డిస్ట్రస్తో బాధపడడ్డాడని, ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
