అక్కడ చికెన్ ధర కేజీ ధర రూ.1000 నుంచి రూ.2000 ఎందుకంటే...!
దేశంలో కరోనా వైరస్ విజృంభణ తగ్గుముఖం పట్టింది. కానీ ఇప్పుడు దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. ఇక చికెన్ తినడం వల్ల ఎలాంటి భయం లేదని రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించినా కూడా జనం ఆందోళన తగ్గడం లేదు. దీంతో చికెన్ ధరలు చిక్కిపోయాయి. వారం రోజుల్లో కేజీ ధర రూ.50 మేర పడిపోయింది. ఇప్పుడు కోళ్ల పేరు చెబితేనే జనం భయపడుతున్నారు.
అయితే అక్కడ మాత్రం చికెన్ ధర చుక్కలు చూపిస్తోంది. కేజీ ధర రూ.1000 నుంచి రూ.2000 వరకు పలుకుతోంది. మొత్తం కోడిని తీసుకోవాలంటే రూ.3000 వరకు చెల్లించాల్సి వస్తుంది. ఇంతకీ ఇంత రేటు పలికేది ఎక్కడనే కదా. కోడిపందాల బరుల వద్ద. ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలుచోట్ల కోళ్ల పందాలు వేస్తున్నారు. ఈ పందాల్లో కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి ఆడుతున్న దృశ్యాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.
కోడి పందాలు జరిగే సమయంలో కొన్ని రూల్స్ కూడా పెట్టుకుంటారు. కొందరు పందెం వరకు మాత్రమే పెడతారు. గెలిచినా, ఓడినా ఎవరి కోడి వారు తీసుకుంటారు. కొందరైతే ఓడిన పుంజును గెలిచిన వారికి ఇచ్చేసి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇలా రకరకాలైన పందేలు జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి పండుగ మూడు రోజులు ఇలాంటి హడావిడి ఉంటుంది. ఇప్పటికే భోగి, సంక్రాంతి అయిపోయాయి. ఇక మూడో రోజు కనుమ నాడు పందేల హడావిడి ఎక్కువ ఉంటుంది.
ఇక కనుప మండుగ రోజు ప్రతి ఇంట్లోనూ మాంసం వండుతారు. కాబట్టి, కనుమ రోజు కొట్టే కోడి ధర ఇంకా ఎక్కువ రేటు పలుకుతూ ఉంటుంది. కోడి పందాల బరులకు దగ్గర్లోనే మరో వ్యాపారం కూడా జోరుగా సాగుతోంది. పందెంలో చచ్చిన కోళ్లను వెంటనే అక్కడికక్కడే కాల్చి ఇచ్చేవారు కూడా సిద్ధమయ్యారు. కోళ్లను చక్కగా నిప్పుల మీద కాల్చి, దాన్ని మొత్తం క్లీన్ చేసి ఇస్తారు. చక్కగా అక్కడే కోళ్లను కాల్చుకుని ఇంటికి తీసుకుని వెళ్లి వండుకుని తినడమే.
