సుప్రీంలో షిండే వర్గం యూటర్న్
సుప్రీంలో షిండే వర్గం యూటర్న్
శివసేన పార్టీ తమదంటే తమదేనంటూ అటు ఉద్ధవ్ థాకరే వర్గీయులు ఇటు ఏక్నాథ్ షిండే వర్గీయులు పోటాపోటీగా కోర్టును ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.
అయితే ఈ అంశంపై సోమవారం (ఆగస్టు 8) నాడు తీర్పు చెప్తామని సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. దీనితో పాటు ఈ వివాదంపై షిండే వర్గం యూటర్న్ తీసుకోవడాన్ని సుప్రీం తప్పు పట్టింది. ఎమ్మెల్యేల అనర్హత వేటుపై అసెంబ్లీ స్పీకర్ను కాకుండా సుప్రీం తలుపు తట్టిన షిండే వర్గం.. తాజాగా ఈ అంశం అసెంబ్లీ పరిధిలోకి వస్తుందని వ్యాఖ్యానించడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
''మీపై (రెబల్స్) అనర్హత పిటిషన్ వేస్తున్నారనగానే ముందుగా కోర్టుకు వచ్చారు. రక్షణ పొందారు. ఆ పిటిషన్ను స్వీకరించడం కర్ణాకట కేసులో సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా మేం తీర్పునిచ్చాం. అటువంటి సమస్యలను స్పీకర్ నిర్ణయించాలి. కానీ అప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్లకుండా కోర్టుకు వచ్చారు. ఇప్పుడు మీరు మెజారిటీ సాధించి, మీ ఎమ్మెల్యేను స్పీకర్గా ఎన్నుకున్నారు. మీకు బలం పెరిగిందని ఆ సమస్యను స్పీకర్ పరిష్కరించాలని మీరు కోరుకుంటున్నారు'' అంటూ సుప్రీం బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంతకు ముందు ఉద్ధవ్ థాకరే వర్గం తరఫున వాదనలు వినిపించిన కపిల్ సిబల్... రాజ్యాంగంలోని ఆర్టికల్ 10 ప్రకారం షిండే వర్గం ఎమ్మెల్యేలు తమపై అనర్హత వేటు పడకుండా ఉండాలని భావిస్తే వారికున్న ఏకైక మార్గం కొత్తపార్టీ పెట్టుకోవడం లేదంటే వేరే పార్టీలో కలిసిపోవడమేనని అన్నారు. దీన్ని హరీశ్ సాల్వే కొట్టిపారేశారు. సొంత పార్టీ విశ్వాసం కోల్పోయిన నాయకుడు సభ్యులను ఎలాగోలా తన చేతుల్లో ఉంచుకొనేందుకు వాడే ఆయుధం 'ఫిరాయింపు నిరోధక చట్టం' కాదని పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం తీర్పును ఈ నెల 8న వెల్లడిస్తామని తెలిపారు.
