తెలంగాణ పదవ తరగతి పరీక్షలలో కీలక మార్పులు
తెలంగాణ పదవ తరగతి పరీక్షలలో కీలక మార్పులు
పదో తరగతి పరీక్షలకు తెలంగాణ విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది. మే రెండోవారంలో పరీక్షలు నిర్వహించేందుకు రెడీగా ఉన్నామంటూ బోర్డ్ విద్యాశాఖకు నివేదిక పంపింది. కరోనా ఎఫెక్ట్తో.. ఈసారి పరీక్షల నిర్వహణలో పలు మార్పులను సూచించింది. మరి ఏంటా మార్పులు.. ఈసారి పరీక్షలు ఎలా ఉండబోతున్నాయి..? తెలంగాణలో తిరిగి స్కూల్స్ తెరుచుకోవడానికి సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కాబోయే తరగతులకు సంబంధించి మరో రెండు రోజుల్లో పరీక్షల క్యాలెండర్ను ప్రకటించనుంది విద్యాశాఖ.
దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా బోర్డులు విద్యాశాఖకు నివేదికలు సైతం పంపించాయి. ఇంటర్ పరీక్షలు మే మొదటి వారంలో నిర్వహించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. ఇవి ముగిసిన వెంటనే 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మే 3నుంచి ఇంటర్ పరీక్షలు జరిగితే మే 18లోపు పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఆ వెంటనే 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. పదో తరగతి పరీక్షలను మే 20న ప్రారంభించి 29వ తేదీతో పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. మేలో అధిక ఎండల కారణంగా విద్యార్థులకు సమస్య అవుతుందని ప్రభుత్వం భావిస్తే… జూన్ మెుదటి వారంలో ప్రారంభించేందుకు అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభమైతే దాదాపు 90రోజుల ఫిజికల్ అటెండెన్స్ ఉండేలా తరగతులు నిర్వాహణకు రంగం సిద్దమవుతోంది.
మరోవైపు 10వ తరగతి పరీక్షల విధానంలో కీలక మార్పులు చేయబోతున్నారు. ఇప్పటివరకు 6 సబ్జెక్టులకు 11 పరీక్షలు నిర్వహిస్తుండగా… ఈసారి సబ్జెక్టుకు ఒక పరీక్ష చొప్పున ఆరు పేపర్స్ మాత్రమే ఉంటాయని సమాచారం. అంతర్గత పరీక్షలు నాలుగుకి… బదులు రెండు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉంటుంది. మరోవైపు 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నపత్రాలను రూపొందించేందుకు SSC, NCERT కసరత్తు చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల 50 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.
