హెచ్చరిక: మూడు రాష్ట్రాలకు తుఫాను ముప్పు...!
తెలుగు రాష్ట్రాలతో పాటూ తమిళనాడు రాష్ట్రానికి కూడా తుఫాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు వాయుగుండంగా మారుతుందని.. రేపు తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇరాన్ దేశం సూచించిన 'నివర్' అని ఈ తుఫానుకు పేరు పెట్టారు. నివర్ ఎల్లుండి తమిళనాడు, పుదుచ్చేరి తీరంలోని కరైకల్, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో ఇప్పటికే వర్ష ప్రభావం ఉందని, రాయలసీమలో రేపటి నుంచి, ఎల్లుండి నుంచి తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాల వెంబడి గంటకు 45 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.
