త్వరలో మట్లాడే ఏటియంలు అందుబాటులోకి వస్తున్నాయి.
త్వరలో మట్లాడే ఏటియంలు అందుబాటులోకి వస్తున్నాయి.
ఇప్పటి వరకు మనం సాధారణంగా నగదు ఉపసంహరించుకోవడం కోసం లేదా బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కోసం ఎటిఎమ్ దగ్గరికి వెళ్లి ఉంటాం. కానీ అదే వర్చువల్ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడటం లేదా మీ కెవైసిని పూర్తి చేయడం కోసం ఎటిఎమ్ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇది సాధ్యం కాదు అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ సైన్స్ ఫిక్షన్ ని నిజం చేయబోతుంది హైదరాబాద్ కు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ & రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (ఐడిఆర్బిటి) సంస్థ.
ఆసక్తికర విషయం ఏమిటంటే, కొద్దీ రోజుల క్రితం ప్రముఖ టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్టెల్ హైదరాబాద్ నగరంలో ఒక ప్రైవేట్ నెట్వర్క్ సహాయంతో 5జీ సేవలను పరీక్షించి చూసారు. 5జీ కనెక్షన్తో 1జీబీ ఫైల్ డౌన్లోడ్ చేయడానికి 30 సెకన్ల మాత్రమే పట్టింది. "రాబోయే సరికొత్త టెక్నాలజీ 5జీ సహాయంతో ఎటిఎంలు ఒక బ్యాంక్ బ్రాంచ్గా పనిచేస్తాయి. అలాగే ఎటిఎంలు 5జీ నెట్వర్క్లకు రిలేయింగ్ పాయింట్లుగా మారవచ్చ అని ఐడిఆర్బిటి మాజీ డైరెక్టర్ ఎ.ఎస్.రామశాస్త్రి అన్నారు. ఇతని నాయకత్వంలోనే ఈ టెక్నాలజీపై ప్రయోగాలు మొదలయ్యాయి.
2022లో మాట్లాడే ఎటిఎంలు: 2జీ, 3జీ లేదా 4జీ విషయానికి వస్తే భారతదేశం ఇతర దేశాలతో చాలా వెనుకబడి ఉండేది. కానీ ఇప్పుడు 5జీ టెక్నాలజీ విషయానికి వచ్చేసరికి ఇతరదేశాలతో పోటీ పడే స్థాయికి ఎదిగింది అని ఎ.ఎస్.రామశాస్త్రి అన్నారు. ఆర్బిఐ బ్యాంకింగ్, ఆర్థిక సేవల కోసం దేశంలో 5జీ సాంకేతికతను ఉపయోగించడం కోసం ప్రభుత్వం సెప్టెంబర్ 2020లో ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగం ఈ సాంకేతికతకు ముందుగానే సిద్ధంగా ఉండాలని పరిశోధకులు, బ్యాంకర్లతో సహా 10 నుండి 12 మంది వ్యక్తుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ బృందం 5జీ టెక్నాలజీ ద్వారా బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో రాబోయే మార్పులను ముందుగానే గ్రహించి దానికి తగ్గట్లుగా ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది. ఇందులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి దీనిని 2022 నాటికీ మార్కెట్ లో ప్రదర్శించాలని చూస్తున్నారు. ఈ 5జీ టెక్నాలజీ వల్ల ఆర్థిక రంగంలో చాలా మార్పులు సంభవిస్తాయని రామశాస్త్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, అధిక బ్యాండ్విడ్త్ లభించడం వల్ల వారు కూడా డిజిటల్ చెల్లింపుల వైపు మొగ్గుచూపుతారు. లావాదేవీల కూడా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయబడతాయి. కానీ వారు 5జీ టెక్నాలజీ ఉన్న గాడ్జెట్లు కొనగలరా లేదా బ్యాంకింగ్ ఉద్యోగులు వారి దగ్గరికి చేరువ చెయ్యాలా అని ఆలోచిస్తున్నామని రామశాస్త్రి అన్నారు.
